East Godavari District: జగన్ ఫొటోకు జనసేన ఎమ్మెల్యే రాపాక పాలాభిషేకం.. పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం

  • ఆటో డ్రైవర్ల సభకు హాజరైన రాపాక
  • వారితో కలిసి జగన్ ఫొటోకు పాలాభిషేకం
  • పార్టీ మార్పు వార్తలను నమ్మొద్దన్న జనసేన ఎమ్మెల్యే

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోకు వైసీపీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాలాభిషేకం చేయడం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో హాట్ టాపిక్ అయింది. ఆయన పార్టీ మారబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకంపై ఆటో, క్యాబ్ డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించి, సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పినిపె విశ్వరూప్, జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లతో కలిసి జగన్ ఫొటోకు రాపాక పాలాభిషేకం నిర్వహించారు.

అంతే, ఆ ఫొటోలతో సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఆయన పార్టీ మారబోతున్నారని, అందుకు ఈ ఫొటోనే నిదర్శనమంటూ వార్తల హోరు మొదలైంది. దీంతో రాపాక స్పందించక తప్పలేదు. ఇదంతా తప్పుడు ప్రచారమని, నమ్మొద్దని కోరారు. తనను నమ్మి అధినేత పవన్ కల్యాణ్ టికెట్ ఇస్తే, అభిమానులు, జనసైనికులు కష్టపడి తన గెలుపునకు కృషి చేశారని, వారిని వంచించబోనని స్పష్టం చేస్తూ తన ఫేస్‌బుక్ ద్వారా వివరణ ఇచ్చారు. కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

More Telugu News