Nalgonda District: సూర్యాపేటలో ఘోర దుర్ఘటన: సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. 'అంకుర్' ఆసుపత్రి సిబ్బంది ఆరుగురి గల్లంతు!

  • స్నేహితుడి పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఘటన
  • చాకిరాల వద్ద అదుపు తప్పి కాల్వలోకి కారు
  • ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం

సూర్యాపేట జిల్లాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఓ కారు అదుపు తప్పి సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు గల్లంతయ్యారు. కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలంలోని చాకిరాల వద్ద ఈ ఘటన జరిగింది. నిన్న ఉదయం వీరు ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి హైదరాబాద్ వస్తుండగా కారు అదుపు తప్పి సాగర్ ఎడమ కాలువలోకి దూసుకెళ్లింది.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే, కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. గల్లంతైన వారు హైదరాబాద్ ఏఎస్‌రావు నగర్‌లోని అంకుర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న అబ్దుల్ అజీద్ (45), రాజేష్ (29), జాన్సన్ (33), సంతోష్ కుమార్ (23), నగేష్ (35), పవన్ కుమార్ (23)లుగా గుర్తించారు. సహోద్యోగి విమలకొండ మహేశ్ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

More Telugu News