Tsrtc: రేపటి ఆర్టీసీ సమ్మెకు టీ-కాంగ్రెస్ పూర్తి మద్దతు: మల్లు భట్టి విక్రమార్క

  • బంద్ లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం కావాలి
  • రాష్ట్రంలో పాలన కుంటుపడింది
  •  ఆర్టీసీ ఆస్తులు అమ్మాలని చూస్తున్నారు

టీఎస్సార్టీసీ కార్మికులు రేపు నిర్వహించనున్న సమ్మెకు టీ-కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బంద్ లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో పాలన కుంటుపడిందని విమర్శించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై ఆయన విమర్శలు గుప్పించారు.

ఆర్టీసీ ఆస్తులను అమ్మాలని చూస్తున్నారని, ఆర్టీసీ రూట్లను ప్రైవేట్ పరం చేస్తున్నారని, దీని వెనుక దుర్మార్గమైన కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల పోరాటం సహేతుకమైనదని, గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలనే ఇప్పుడు నెరవేర్చమని వారు కోరుతున్నారని అన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయొద్దని కోరారు. టీఆర్ఎస్ నేత కేశవరావు సహా టీఆర్ఎస్ నేతలు బంద్ లో పాల్గొనాలని, ప్రజల పక్షాన నిలబడతారో లేదో తేల్చుకోవాలని సూచించారు. రేపటి బంద్ నేపథ్యంలో నాయకుల ముందస్తు అరెస్ట్ లను ఖండిస్తున్నట్టు చెప్పారు.

More Telugu News