Botsa Satyanarayana: నువ్వు చెలాయించిన అధికారంలో మేం వీసమెత్తు కూడా చెలాయించడంలేదే!: చంద్రబాబుపై బొత్స ఫైర్

  • చంద్రబాబుపై బొత్స ఎదురుదాడి
  • గౌరవం నిలుపుకోవాలని హితవు
  • ఎందుకోసం నీ ఆక్రోశం అంటూ వ్యాఖ్యలు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎదురుదాడికి దిగారు. అనుభవం ఉందని చెప్పుకోవడం కాకుండా, ఏదైనా అంశంలో తప్పు జరిగిందని చెబితే సరిదిద్దుకుంటామని, అంతేతప్ప జరిగినవీ, జరగనివీ అన్నింటికి ముడిపెట్టి లబ్దిపొందాలని చూడడం సబబు కాదని హితవు పలికారు. "ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు అమాయకులనుకుంటున్నావా నువ్వు? తప్పు తప్పు! నీలో ఏదైనా గౌరవం మిగిలుంటే కనీసం అదైనా దాచుకోవడానికి ప్రయత్నించు" అంటూ వ్యాఖ్యానించారు.

"నువ్వు ఎంత అధికారం చెలాయించి ఉంటావు, దాంట్లో కనీసం వీసమెత్తు అయినా మేం చెలాయించి ఉంటామా చెప్పండి!" అంటూ అడిగారు. "నువ్వు చెలాయించిన అధికారంతో పోలిస్తే మేం పది శాతం కూడా చెలాయించడంలేదు. ఆ విధంగా మేమూ చేస్తే నువ్వు భరించలేవేమో!" అంటూ విమర్శించారు.

"నీ జులుం కానీ, నీ అహంభావం కానీ, నీ పార్టీ నేతలను, కార్యకర్తలను నువ్వు పెట్టే హింసలు కానీ, అవమానాలు కానీ మేం వీసమెత్తు కూడా చేయడంలేదే! దేనికోసం నీ ఆక్రోశం!" అంటూ బొత్స తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబునాయుడు ఇటీవల ప్రభుత్వ విధానాలను సునిశితంగా విమర్శిస్తున్న నేపథ్యంలో బొత్స కాస్త ఘాటుగా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

More Telugu News