Piyush Goyal: నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఈ-కామర్స్ సంస్థలపై కఠిన చర్యలు: పీయూష్ గోయల్

  • ఎఫ్‌డీఐ విషయంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి
  • విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 49 శాతానికి మించకూడదు
  • రిటైల్ మార్కెట్ ను దెబ్బ తీసేలా వస్తువులపై డిస్కౌంట్లు ఉండొద్దు

దేశంలోని మల్టీ బ్రాండ్ రిటైలర్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విషయంలో నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే అటువంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హెచ్చరించారు. 'ఈ-కామర్స్ సంస్థలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది. వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. చట్టం ప్రకారం మల్టీ బ్రాండ్ రిటైల్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 49 శాతానికి మించకూడదు. దేశంలోని చిన్న వ్యాపారులు జీవనోపాధి కోల్పోకుండా వారికి బీజేపీ అండగా నిలబడుతుంది' అని తెలిపారు.

'రిటైల్ మార్కెట్ ను దెబ్బ తీసేలా వస్తువులపై డిస్కౌంట్లు, మోసపూరిత ధరలు ప్రకటించే హక్కు ఈ-కామర్స్ సంస్థలకు లేదు. అలాగే, సొంతంగా ఉత్పత్తులను తయారు చేసుకుని, విక్రయించే హక్కు కూడా లేదు. ఇటీవల ప్రకటించిన ధరల విషయంలో పూర్తి వివరణ ఇవ్వాలని ఈ-కామర్స్ సంస్థలను వాణిజ్య శాఖ ఇప్పటికే ఆదేశించింది' అని పీయూష్ గోయల్ వివరించారు. కాగా, పండుగల నేపథ్యంలో అమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌ వంటి సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటించి, వినియోగదారులను ఆకర్షించిన విషయం తెలిసిందే.

More Telugu News