Ranjan Gogoi: నా వారసుడు జస్టిస్ బాబ్డే... మోదీ సర్కారు అభిప్రాయాన్ని కోరిన జస్టిస్ రంజన్ గొగొయ్!

  • నవంబర్ 17న గొగొయ్ పదవీ విరమణ
  • తదుపరి సీజేగా జస్టిస్ ఎస్ఏ బాబ్డే
  • కేంద్రానికి లేఖ రాసిన గొగొయ్

తాను వచ్చే నెల 17న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు తదుపరి చీఫ్ జస్టిస్ గా శరద్ అరవింద్ బాబ్డేను సిఫార్సు చేస్తూ, కేంద్రం అభిప్రాయం చెప్పాలని ప్రస్తుత సీజే రంజన్ గొగొయ్ కోరారు. ఈ మేరకు మోదీ సర్కారుకు లేఖ రాసిన ఆయన, తన తరువాత సీనియారిటీలో బాబ్డే రెండో స్థానంలో ఉన్నారని గుర్తు చేశారు. కాగా, జస్టిస్ బాబ్డే, గతంలో మధ్యప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 2021, ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు.

1956, ఏప్రిల్ 24న మహారాష్ట్రలోని నాగపూర్ లో జన్మించిన బాబ్డే, నాగపూర్ యూనివర్శిటీలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఆపై 2000 సంవత్సరంలో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2012లో మధ్యప్రదేశ్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అయ్యారు. ఏప్రిల్ 2013 నుంచి సుప్రీంకోర్టులో విధులను నిర్వహిస్తున్నారు. స్వయంగా గొగొయ్ నుంచి సిఫార్సులు రావడంతో బాబ్డే నియామకం వైపు కేంద్రం మొగ్గు చూపవచ్చని తెలుస్తోంది.

More Telugu News