BJP: ఏపీకి రానున్న అమిత్ షా... ఎవరూ ఊహించని నేతల చేరికలు ఉంటాయన్న బీజేపీ జాతీయ కార్యదర్శి!

  • ఇచ్చిన ప్రతి హామీనీ జగన్ విస్మరించారు
  • అధికారంలోకి రాగానే మారిపోయారు
  • గుంటూరులో సత్యకుమార్ ఆగ్రహం

వచ్చే నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కూడా పర్యటించే సమయంలో, ఊహించని నేతల చేరికలు ఉంటాయని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ తెలిపారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇచ్చిన ప్రతి హామీనీ జగన్ విస్మరించారని, అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన మాటలు మారిపోయాయని ఆరోపించారు. విశ్వసనీయత, మడమ తిప్పను అనే పదాలను ఆయన మాట్లాడకుండా ఉంటే మంచిదని చురకలంటించారు.

ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేకులు మాత్రమే దేశ ఆర్థిక వ్యవస్థ సక్రమంగా లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించిన ఆయన, మోదీ దార్శనికత గల నేతని అభివర్ణించారు. రైతులను మోసం చేసినందునే చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం, గత ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిందని, ఇప్పుడు జగన్ కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారని సత్యకుమార్ ఆరోపించారు. ఐదేళ్ళలో రైతులకు రూ. 80 వేలు ఇస్తామని చెప్పిన జగన్, ఇప్పుడు కొర్రీలు పెడుతున్నారని నిప్పులు చెరిగారు. కంటి వెలుగు పథకం కూడా కేంద్రం నిధులతో నడుస్తున్నదేనని అన్నారు.

More Telugu News