Hyderabad: తల్లిదండ్రుల మాటకే భర్త విలువిస్తున్నాడని.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

  • జూబ్లీహిల్స్‌లో ఘటన
  • తిరుపతి వెళ్లే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ
  • విమానంలో వెళ్దామన్న భార్య.. రైలులో వెళ్దామన్న భర్త

తన మాటకు విలువ లేకుండా పోయిందన్న కారణంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన ప్రవళ్లిక (30), వెంకటరమణ (38) భార్యాభర్తలు. 2014లో వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి తొమ్మిది నెలల వయసున్న పాప రిత్విక ఉంది. కుమార్తె పుట్టు వెంట్రుకలు సమర్పించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 10న వీరు రైలులో తిరుపతి వెళ్లాల్సి ఉండగా, అనుకోని కారణాలతో వాయిదా పడింది.

రైలు ప్రయాణం వాయిదా పడడంతో విమానంలో వెళ్దామని భర్తతో ప్రవళ్లిక గొడవ పడింది. భర్త సర్ది చెబుతున్నా వినిపించుకోని భార్య గత రెండుమూడు రోజులుగా గొడవ పడుతోంది. వారం రోజుల తర్వాత అందరం కలిసి రైలులో తిరుపతి వెళ్దామని వెంకటరమణ చెప్పుకొచ్చాడు. దీంతో తన కంటే తల్లిదండ్రుల మాటకే ఎక్కువ విలువ ఇస్తున్నాడని మనస్తాపం చెందింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన ప్రవళ్లిక బుధవారం విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది. భర్తతో మాట్లాడకుండా గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. బహుశా తనపై అలిగి పడుకుందని వెంకటరమణ భావించాడు.

ఉదయం తలుపు కొట్టినా తీయకపోవడంతో అనుమానంతో కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లి ఆమెను కిందికి దించారు. అనంతరం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News