Sachin Tendulkar: ఇండియా తరఫున మళ్లీ ఓపెనింగ్ జోడీగా సచిన్, సెహ్వాగ్... ఫిబ్రవరిలో దిగ్గజాల మ్యాచ్!

  • ఫిబ్రవరి 2 నుంచి 16 వరకూ మ్యాచ్ లు
  • ముంబై, పుణె వేదికగా టోర్నీ
  • పాల్గొననున్న మాజీ క్రికెటర్లు

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి ఇండియా తరఫున ఓపెనింగ్ జోడీగా దిగి, క్రికెట్ మ్యాచ్ లు ఆడనున్నారు. క్రికెట్ ఆటను విరమించుకున్న మాజీలతో కొత్త లీగ్ ఒకటి జరుగనుంది. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు 'రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ టి20 లీగ్‌' పేరిట, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 2 నుంచి 16 వరకు ముంబై, పుణే వేదికగా ఈ టోర్నీ జరుగుతుంది.

సచిన్‌ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, తిలక రత్నే దిల్షాన్, బ్రెట్‌ లీ, జాంటీ రోడ్స్‌, బ్రియాన్‌ లారా తదితర ఎంతో మంది నిన్నటి తరం స్టార్ క్రికెటర్లు ఈ పోటీల్లో పాల్గొంటారు. ఇండియా లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్, దక్షణాఫ్రికా లెజెండ్స్, శ్రీలంక లెజెండ్స్, వెస్టిండీస్‌ లెజెండ్స్‌ గా ఐదు జట్లు పోటీలో ఉంటాయి. మొత్తం 75 మంది వరకూ రిటైర్డ్‌ క్రికెటర్లు ఇందులో ఆడతారు. లీగ్ లో భాగంగా 10 మ్యాచ్‌ లు, ఆపై టాప్-2లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ పోటీ ఉంటుంది.

ఇక ఇండియా జట్టు సచిన్ కెప్టెన్సీలో ఆడనుండగా, సెహ్వాగ్, జహీర్ ఖాన్ తదితరులు కూడా ఉంటారు. వెస్టిండీస్ జట్టుకు బ్రియాన్‌ లారా, దక్షిణాఫ్రికాకు జాంటీ రోడ్స్, శ్రీలంకకు దిల్షాన్, ఆస్ట్రేలియాకు బ్రెట్‌ లీ నాయకత్వం వహిస్తారు. ఈ పోటీల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని రోడ్డు భద్రత అవగాహనా కార్యక్రమాలు నిర్వహించే 'శాంత్‌ భారత్‌-సురక్షిత్‌ భారత్‌' సంస్థకు విరాళంగా ఇవ్వనున్నారు.

More Telugu News