Tamil Nadu: ప్రభుత్వ పాఠశాలలో మద్యంతో బాలిక పుట్టిన రోజు వేడుకలు.. మందలించినందుకు ఆత్మహత్య

  • తోటి విద్యార్థులతో కలిసి తరగతి గదిలో బర్త్‌డే
  • చేతిలోని మద్యం సీసాలు చూసి టీచర్ ఆగ్రహం
  • ఇంటికెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని

ప్రభుత్వ పాఠశాలలో ఓ బాలిక తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను మద్యంతో జరుపుకోగా, విషయం తెలిసిన ఉపాధ్యాయిని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులోని సేలం ప్రభుత్వ పాఠశాలలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. సేలం ఇడైపట్టి విద్యాజోన్‌కు చెందిన ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాలలో 1,500 మంది బాలికలు చదువుతున్నారు.

మంగళవారం ఉదయం స్కూల్‌లో అబ్దుల్ కలాం జయంతిని నిర్వహించారు. ప్లస్ టు చదువుతున్న ఓ విద్యార్థిని బర్త్‌డే కూడా అదే రోజు కావడంతో ఐదుగురు విద్యార్థులు కలిసి తరగతి గదిలో ఆమెతో కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసుకున్నారు. సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేశారు.

అదే సమయంలో తరగతి గదిలోకి వచ్చిన టీచర్ వారి చేతుల్లోని బీర్ బాటిళ్లు చూసి ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి తల్లిదండ్రులను పిలిపించి వారి ఎదుటే విద్యార్థులను మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన విద్యార్థిని ఒకరు తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండానే కుమార్తె మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేయడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News