KCR: హుజూర్‌నగర్‌లో నేడు కేసీఆర్ ప్రచారం.. ఆరున్నర నెలల తర్వాత మళ్లీ ప్రచారంలోకి సీఎం!

  • ఏప్రిల్ 8న వికారాబాద్‌లో చివరిసారి ఎన్నికల ప్రచారం
  • సైదిరెడ్డి గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్
  • బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి

ఈ నెల 21న ఉప ఎన్నిక జరగనున్న హుజూర్‌నగర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ నాయకులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు హుజూర్‌నగర్ గుట్ట సమీపంలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. తమ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి తరపున స్వయంగా ప్రచారానికి దిగడం గమనార్హం.

మధ్యాహ్నం 12:30 గంటలకు కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి హెలికాప్టర్‌లో హుజూర్‌నగర్ చేరుకుంటారు. బహిరంగ సభ అనంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. అనంతరం రాత్రి అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. కాగా, కేసీఆర్ ఆరున్నర నెలల తర్వాత మళ్లీ ప్రచార బరిలోకి దిగుతున్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ చివరిసారి ఏప్రిల్ 8న వికారాబాద్‌లో ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఇదే తొలిసారి.

More Telugu News