Chandrababu: చంద్రబాబు, ఆయన మోచేతులు నాకే వారికి గుండెదడ పెరిగిపోయింది: ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

  • సీఎం ఒక్కొక్క పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు
  • జగన్ ‘మడమ తిప్పాడు’ అన్న సొల్లువాగుడు వాగొద్దు
  • ‘పులివెందుల పంచాయతీ, జె-ట్యాక్స్’ అంటూ ఏడుపు రాగాలు తీయొద్దు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు తీవ్ర వ్యాఖ్యలు, విమర్శలు చేశారు. ఈ సందర్భంగా చేసిన వరుస ట్వీట్లలో బాబును విమర్శిస్తూ ఘాటు పదజాలం వాడారు. వైసీపీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఏపీ సీఎం జగన్ ఒక్కొక్క పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంటే చంద్రబాబునాయుడు, ఆయన మోచేతులు నాకే బ్యాచికి గుండె దడ పెరిగి పోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ‘మడమ తిప్పాడు’ అని కొందరు, ‘నాలుగు నెలలకే డీలాపడ్డాడు’ అని మరికొందరు సొల్లు వాగుడు వాగుతున్నారని దుయ్యబట్టారు.

గ్రామ సచివాలయ ఉద్యోగాలు సంపాదించుకున్న ఉత్సాహంలో తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారని, ‘వైఎస్ రైతు భరోసా’లో లబ్ధిదారుల జాబితా వెలువడి గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంటే, చంద్రబాబు ఏమో ‘పులివెందుల పంచాయతీ, జె-ట్యాక్స్’ అని ఏడుపు రాగాలు తీస్తుంటే క్షేత్ర స్థాయిలో ఆయనపై తుపుక్కుమని ఊస్తున్నారని మరో ట్వీట్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబునాయుడి మానసిక స్థితిపై ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, ఎప్పుడేం మాట్లాడుతున్నాడో తెలియడం లేదని ఇంకో ట్వీట్ లో విమర్శించారు. నిరాశానిస్పృహలతో పాటు ఎప్పటికీ తనకు అధికారం దక్కదనే భీతి చంద్రబాబును కుంగదీస్తోందని వ్యాఖ్యానించారు.

More Telugu News