Chiranjeevi: మోదీ, అమిత్ షాలను కలవనున్న చిరంజీవి.. ఢిల్లీ చేరుకున్న మెగాస్టార్

  • సీఎం రమేశ్ తో కలిసి ఢిల్లీ వెళ్లిన చిరంజీవి
  • కాసేపట్లో మోదీని కలవనున్న మెగాస్టార్
  • సాయంత్రం వెంకయ్యనాయుడితో కలసి 'సైరా' సినిమాను వీక్షించనున్న చిరు


'సైరా' సినిమాతో బంపర్ హిట్ కొట్టిన చిరంజీవి... విజయానందాన్ని ఆస్వాదిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలసి తన సినిమాను వీక్షించడానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. తమిళనాడు గవర్నర్ తమిళిసై కూడా ఈ చిత్రాన్ని చూసి, అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను చిరంజీవి కలవబోతున్నారు.

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ తో కలసి వెళ్లిన చిరంజీవి... ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. తొలుత ప్రధాని మోదీని కలిసి 'సైరా' సినిమాను చూడాల్సిందిగా కోరనున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కలసి 'సైరా' చిత్రాన్ని ఆయనకు ప్రత్యేకంగా చూపించనున్నారు.  

More Telugu News