Jagdeep Dhankhar: ఒక్క సెకను పాటు కూడా టీవీలో చూపించలేదు.. చాలా అవమానంగా ఫీలయ్యా: బెంగాల్ గవర్నర్ ఆవేదన

  • దుర్గాపూజలో గవర్నర్ ధన్కర్‌కు అవమానం
  • తీవ్ర కలతకు గురయ్యానన్న గవర్నర్
  • ఇది యావత్ బెంగాల్ ప్రజలకు జరిగిన అవమానమన్న  ధన్కర్

కోల్‌కతాలో ఇటీవల జరిగిన దుర్గాపూజలో తనకు తీవ్ర అవమానం జరిగిందని పశ్చిమబెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్కర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనను ప్రధాన వేదిక వద్ద కూర్చోబెట్టలేదని, నాలుగు గంటలపాటు కార్యక్రమం జరిగితే కనీసం సెకను పాటు కూడా తనను టీవీలో చూపించలేదని పేర్కొన్నారు. ఇది తనను తీవ్ర కలతకు, ఆవేదనకు గురిచేసిందని అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల తీరుపై గవర్నర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇది తనకు తీవ్ర ఆవేదన కలిగించిందని, చాలా అవమానంగా ఫీలయ్యానని గవర్నర్ పేర్కొన్నారు. ఇది తనకొక్కడికే జరిగిన అవమానం కాదని, యావత్ బెంగాల్ ప్రజలదని అన్నారు. ఇలాంటి అవమానాలను ప్రజలు ఎప్పటికీ జీర్ణించుకోలేరని అన్నారు. గాయపడిన హృదయంతో చెబుతున్నానని, ఇలాంటి ఘటనలు రాజ్యాంగ విధుల్ని నిర్వర్తించకుండా తనను అడ్డుకోలేవని గవర్నర్ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ప్రథమ పౌరుడినైన తనను టీవీలో ఒక్క క్షణం కూడా చూపించలేదని, బహుశా ఎప్పుడూ, ఎక్కడా ఇలా జరిగి ఉండదని అన్నారు. నాలుగు గంటలపాటు అక్కడే కూర్చున్నా మీడియా తనను చూపించకపోవడం దారుణమని అన్నారు. చూస్తుంటే ఇది ఎమర్జెన్సీని తలపించేలా ఉందని కొందరు తనతో అన్నారని జగ్‌దీప్ అన్నారు.

More Telugu News