Saidharam Tej: పుట్టినరోజు సందర్భంగా కీలక నిర్ణయం ప్రకటించిన సాయిధరమ్ తేజ్

  • నేడు సాయిధరమ్ తేజ్ జన్మదినం
  • సామాజిక సేవకు ముందుకొచ్చిన మెగాహీరో
  • అభిమానులు కూడా భాగస్వాములు కావాలని పిలుపు

యువ హీరో సాయిధరమ్ తేజ్ తన పుట్టినరోజు సందర్భంగా కీలక నిర్ణయం ప్రకటించారు. ఓ వృద్ధాశ్రమం నిర్మాణం పూర్తిచేసే బాధ్యతను స్వీకరిస్తున్నట్టు తెలిపారు. అంతేగాకుండా, ఏడాదిపాటు ఆ వృద్ధాశ్రమం నిర్వహణకు అయ్యే ఖర్చును కూడా తానే భరించనున్నట్టు తెలిపారు. ఆ వృద్ధాశ్రమం వాళ్లు సోషల్ మీడియాలో తనను ట్యాగ్ చేసి నిర్మాణం పూర్తయ్యేందుకు సహకరించాలని అర్థించారని, ఏదైనా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో తాను కూడా సానుకూలంగా స్పందించానని సాయిధరమ్ తేజ్ వెల్లడించారు.

ఆ వృద్ధాశ్రమం నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయినట్టు తెలిసిందని, దాన్ని పూర్తిచేయాలని భావిస్తున్నానని వివరించారు. అందుకే ఫ్యాన్స్ తన బర్త్ డే నాడు వేడుకలు చేయకుండా, ఆ డబ్బును తనకు పంపితే వృద్ధాశ్రమం కోసం ఉపయోగిస్తానని తెలిపారు. ఇప్పటికే కొందరు అభిమానులు లక్ష రూపాయలకు పైగా డబ్బు పంపారని, అభిమానుల నుంచి ఈ విధంగా సహకారం అందడం గొప్ప విషయమని అన్నారు.

తనను చూసి మరికొందరు ముందుకు వస్తారన్న ఉద్దేశంతోనే ఈ విషయం బయటికి వెల్లడిస్తున్నాను తప్ప, గొప్పలు చెప్పుకోవాలన్నది తన అభిమతం కాదని సాయిధరమ్ తేజ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

More Telugu News