Jagan: నాన్న గారి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో గొప్ప మార్పులు తీసుకొస్తాం: ఏపీ సీఎం జగన్

  • ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది చేస్తున్నాను
  • గత ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు
  • నిన్నటి కన్నా నేటి పరిస్థితులు బాగుంటేనే అభివృద్ధి సాధిస్తున్నట్లు

భూమిలేని ప్రతి నిరుపేదకు అండగా ఉండేందుకే 'వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్' పథకాన్ని తీసుకొచ్చామని ఏపీ సీఎం జగన్ అన్నారు. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం కాకుటూరులో రైతు భరోసా పథకం ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన ప్రతి అంశాన్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు.

'నాన్న గారి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో గొప్ప మార్పులు తీసుకొస్తాం. ప్రతి ఏడాది ఖరీఫ్ పంట వేసే సమయానికి మే నెలలో రూ.7,500 ఇస్తాం. అక్టోబరులో మరో రూ.4 వేలు ఇస్తాం. అంతేగాక, ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి సమయంలో మరో రూ.2 వేలు ఇస్తాం. అంటే రూ.12,500కు బదులుగా ఏటా రూ.13,500 ఇవ్వబోతున్నాం. చెప్పినదానికంటే రూ.వెయ్యి అదనంగా ఇస్తున్నాం. కౌలు రైతులకు కూడా మేలు చేసేలా ఈ పథకం అమలు చేస్తాం. పంటల బీమా కోసం ప్రీమియం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది' అని జగన్ చెప్పారు.

'రైతులు నకిలీ విత్తనాలు, కల్తీ పురుగు మందులతో నష్టపోయే పరిస్థితి రాకుండా చూస్తాం. రైతులకు భరోసా ఉంటేనే రాష్ట్రానికి భరోసా ఉంటుంది. నాణ్యతతో కూడిన విత్తనాలు, పురుగు మందులు అందిస్తాం. గ్రామ సచివాలయాల పక్కనే నాణ్యతతో కూడిన విత్తనాలు అందిస్తాం. నెల్లూరులో పెండింగ్ లో ఉన్న ప్రతి ప్రాజెక్టును పూర్తి చేస్తాం. రైతులు పడుతున్న ఇబ్బందులను నేను పాదయాత్ర చేస్తున్న సమయంలో చూశాను. గత ఐదేళ్లలో లక్షల రైతుల కుటుంబాలు నష్టపోయాయి. నిన్నటి కన్నా నేటి పరిస్థితులు బాగుంటేనే అభివృద్ధి సాధిస్తున్నట్లు అర్థం. రైతుల పరిస్థితులు బాగుపడేలా పనులు కొనసాగిస్తున్నాం' అని జగన్ వ్యాఖ్యానించారు.

More Telugu News