Huzurnagar: హుజూర్ నగర్ లో ప్రచారం నిర్వహించనున్న నందమూరి సుహాసిని

  • టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్మయి
  • ప్రచారాన్ని ముమ్మరం చేసిన టీడీపీ
  • అధిష్ఠానం ఆదేశాలతో ప్రచార బరిలోకి సుహాసిని

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కిరణ్మయిని తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఇతర పార్టీలకు దీటుగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. తెలంగాణలో టీడీపీ ఇప్పటికీ బలంగానే ఉందని చాటి చెప్పేందుకు గెలుపు కోసం వ్యూహరచన చేస్తోంది. తాజాగా, కిరణ్మయికి మద్దతుగా ప్రచారం చేసేందుకు దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని బరిలోకి దించాలని నిర్ణయించింది. గత ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేసి పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

రేపటి నుంచి మూడు రోజుల పాటు సుహాసిని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారని తెలుస్తోంది. సుహాసిని ప్రచారం చేయడం వల్ల మహిళల ఓటు బ్యాంకు పెరుగుతుందని టీటీడీపీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు, నందమూరి బాలకృష్ణ కూడా ప్రచారం నిర్వహించబోతున్నారని సమాచారం.

More Telugu News