Gas: మ్యాగీ చేయబోయిన ఏడేళ్ల చిన్నారి... గ్యాస్ సిలిండర్ పేలి మృతి!

  • కర్ణాటకలోని తుముకూరులో ఘటన
  • తల్లి అనుమతితో వంటగదిలోకి వెళ్లిన బిడ్డ
  • అప్పటికే గ్యాస్ లీక్ కాగా ప్రమాదం

కాస్తంత ఆకలి తీర్చుకునేందుకు మ్యాగీ తయారు చేసుకుందామని వంటింట్లోకి వెళ్లిన బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కర్ణాటకలోని తుముకూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే, పట్టణ పరిధిలోని క్రిస్టియన్‌ స్ట్రీట్‌లో తల్లిదండ్రులతో కలిసి వుంటున్న నోయల్‌ ప్రసాద్‌ (7), మ్యాగీ చేసుకుని తింటానని తల్లికి చెప్పాడు. ఆమె కూడా సరేననడంతో వంటగదిలోకి వెళ్లాడు. గ్యాస్ స్టవ్ వెలిగించడానికి ప్రయత్నించాడు.

అయితే, అప్పటికే గ్యాస్‌ లీక్‌ అవుతూ ఉన్న విషయాన్ని ఎవ్వరూ గమనించలేదు. లైటర్‌ తో స్టవ్ ను వెలిగించబోగా, మంటలు ఎగిశాయి. ఈ క్రమంలో నోయల్‌ కు తీవ్రగాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న తల్లిదండ్రులు, వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సైతం చికిత్సను వెంటనే ప్రారంభించి, బిడ్డను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే, గాయాల తీవ్రత అధికంగా ఉండటంతో, వైద్యులు చేసిన చికిత్స అతని ప్రాణాలను నిలపలేకపోయింది. విషయం తెలుసుకున్న తుముకూరు పోలీసులు, కేసు నమోదు చేసి, వివరాలు సేకరించారు. కన్నబిడ్డ మృతితో ఆ ఇంట్లో తీవ్ర విషాదం అలముకుంది.

More Telugu News