congress: కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డ టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి

  • శవాలపై పేలాలు ఏరుకుంటున్న ‘కాంగ్రెస్’ నాయకులు
  • కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని విలీనం చేశారా?
  • ఉపఎన్నిక ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతోంది

కాంగ్రెస్ పార్టీ నాయకులు శవాలపై పేలాలు ఏరుకునే విధంగా ప్రవర్తిస్తున్నారని టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ సమ్మె అంశం లేదా ఇతర అంశాలపై శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు.

ఆర్టీసీ విలీనంపై కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో విలీనం చేశారా? ఎందుకు విలీనం చేయలేదు? అని ప్రశ్నించారు. తెలంగాణలో కార్మిక సంఘాలను, కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆ పార్టీల నాయకులపై నిప్పులు చెరిగారు.

ఈ సందర్భంగా హుజూర్ నగర్ ఉపఎన్నిక గురించి మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతోందని, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని చెప్పారు. కేటీఆర్ రోడ్ షో లకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారని, ఇది చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.

More Telugu News