Telangana: 'సచివాలయం కూల్చివేత'పై తెలంగాణ సర్కారుకు హైకోర్టు సూటిప్రశ్న!

  • సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో పిటిషన్
  • నేడు విచారణ జరిపిన హైకోర్టు 
  • ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం
  • విచారణ రేపటికి వాయిదా

ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చి కొత్తది నిర్మించాలన్న తెలంగాణ సర్కారు నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. తెలంగాణ సచివాలయం కూల్చివేతపై విశ్వేశ్వరరావు అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. సచివాలయాన్ని ఎందుకు కూల్చివేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ భవనానికి అగ్నిప్రమాదం ముప్పు ఉండడంతో కూల్చివేయాలన్న నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. దీనిపై ఫైర్ డిపార్ట్ మెంట్ నుంచి నివేదిక కూడా వచ్చిందని కోర్టుకు విన్నవించారు.

అయితే, అగ్నిమాపక శాఖ నివేదికలో అగ్నిప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని మాత్రమే ఉంది, భవనాలు కూల్చివేయాలని చెప్పలేదు కదా? అని కోర్టు వ్యాఖ్యానించింది. దాంతో, అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే చోట ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం అని అదనపు ఏజీ పేర్కొనగా, ఏపీ ప్రభుత్వం ఖాళీ చేసిన భవనాలు ఉండగా కొత్తవాటితో పనేంటి? అని మరోసారి కోర్టు సూటిగా ప్రశ్నించింది.  

అదే సమయంలో పిటిషనర్ విశ్వేశ్వరావుకు కూడా కోర్టు అక్షింతలు వేసింది. పరిపాలన అంశాల్లో మీరు ఎలా జోక్యం చేసుకుంటారని ప్రశ్నించింది. ప్రజల ధనం దుర్వినియోగం అవుతోందన్న కారణంగా పిటిషన్ వేసినట్టు విశ్వేశ్వరరావు తరఫు న్యాయవాది బదులివ్వగా, సచివాలయ నిర్మాణం కూడా ప్రజల కోసం చేపడుతున్నదే కదా? అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ విధంగా వాదోపవాదాలు సాగిన పిమ్మట విచారణ రేపటికి వాయిదా పడింది.

More Telugu News