Jagan: జగన్, చిరంజీవి భేటీపై చెవిరెడ్డి పేరుతో వచ్చిన ట్వీట్.. ఖండన!

  • అంతా కాలమహిమ అంటూ చెవిరెడ్డి పేరుతో ట్వీట్
  • అదే స్థాయిలో కౌంటర్ రీట్వీట్లు
  • తనకు ట్విట్టర్ అకౌంటే లేదని స్పష్టం చేసిన చెవిరెడ్డి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో మెగాస్టార్ చిరంజీవి నేడు భేటీ కాబోతున్నారు. ఇప్పటికే విజయవాడకు చేరుకున్న ఆయన... ఈ మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ తో సమావేశం కానున్నారు. చిరంజీవి వెంట ఆయన తనయుడు రాంచరణ్ కూడా వెళ్తున్నారు. దసరా సందర్భంగా విడుదలై ఘన విజయం సాధించిన 'సైరా' చిత్రాన్ని వీక్షించాల్సిందిగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని వీరు కోరే అవకాశం ఉంది.

మరోవైపు జగన్, చిరంజీవిల భేటీ సందర్భంగా ఓ ట్వీట్ వేడి పుట్టిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేరుతో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. 'జగన్ అరెస్ట్ సమయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ రాంచరణ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు అదే రాంచరణ్ తన తండ్రితో కలిసి జగన్ ను కలవాలనుకుంటున్నారు. అంతా కాల మహిమ' అనేది ఈ ట్వీట్ సారాంశం. ఈ ట్వీట్ పై కౌంటర్ రీట్వీట్లు కూడా అదే స్థాయిలో వచ్చాయి. చివరకు చెవిరెడ్డి ఈ విషయంలో కలగజేసుకోవాల్సి వచ్చింది. తనకు అసలు ట్విట్టర్ అకౌంటే లేదని ఆయన చెప్పారు. దీంతో, వివాదం సద్దుమణిగింది.

More Telugu News