Asaduddin Owaisi: హిందువుల వల్లే ముస్లింలు సంతోషంగా ఉన్నారన్న ఆరెస్సెస్ చీఫ్.. ఘాటుగా బదులిచ్చిన ఒవైసీ

  • కార్యకారీ మండల్ వార్షిక సమావేశంలో భగవత్ వ్యాఖ్యలు
  • తప్పుబట్టిన అసదుద్దీన్ ఒవైసీ
  • ఇతర దేశాల ముస్లింలతో పోల్చవద్దని సూచన

హిందువుల వల్లే దేశంలోని ముస్లింలు అందరూ సంతోషంగా ఉన్నారన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఒడిశాలో జరిగిన ‘కార్యకారీ మండల్’ వార్షిక సమావేశంలో పాల్గొన్న భగవత్ మాట్లాడుతూ.. హిందూ అనేది ఓ మతం కాదని, అది దేశ ప్రజల సంస్కృతి అని అన్నారు. అది ఒక మతమో, భాషో, దేశం పేరో కాదన్నారు. దేశంలోని పార్సీలు తమ మతాన్ని స్వేచ్ఛగా అనుసరిస్తున్నారంటే, ముస్లింలు అత్యంత సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం మనం హిందువులం కాబట్టేనని భగవత్ పేర్కొన్నారు.

ఆరెస్సెస్ చీఫ్ వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. హిందూయిజానికి అన్వయించి భారత్‌లో ముస్లింల సంస్కృతి, విశ్వాసాన్ని దిగజార్చలేరని ఘాటుగా బదులిచ్చారు. ఇతర దేశాల ముస్లింలతో పోల్చి ఇక్కడి ముస్లింల భారతీయతను తగ్గించలేరని బదులిచ్చారు.

More Telugu News