Karimnagar District: రోడ్డు ప్రమాదంలో ఒక్కగానొక్క కొడుకు మృతి.. మళ్లీ గర్భం దాల్చి కవలలకు జన్మనిచ్చిన 52 ఏళ్ల మహిళ

  • ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన మహిళ
  • కొడుకు పుడతానుకుంటే ఇద్దరు అమ్మాయిలు
  • అయినా హ్యాపీ అన్న దంపతులు

52 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిందో మాతృమూర్తి. మలివయసులో అండగా నిలవాల్సిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం, పెళ్లి చేసి కుమార్తెను అత్తారింటికి పంపండంతో ఒంటరితనాన్ని అనుభవిస్తున్న ఆ దంపతులు మళ్లీ పిల్లలు కావాలనుకున్నారు. ఐవీఎఫ్ విధానం ద్వారా గర్భం దాల్చిన ఆ తల్లి తాజాగా కవలలకు జన్మనిచ్చింది. కరీంనగర్‌లో జరిగిందీ ఘటన.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కారపాకకు చెందిన ఆరె సత్యనారాయణ (55), రమాదేవి (52) దంపతులు. వీరికి ఓ కుమారుడు (18), కుమార్తె (32) సంతానం కాగా, 2013లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత కుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపారు.

కొడుకు దూరం కావడం, కుమార్తె అత్తారింటికి వెళ్లిపోవడంతో ఒంటరితనాన్ని అనుభవిస్తున్న దంపతులు సంతానం కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించారు. ఈ క్రమంలో ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన రమాదేవి శుక్రవారం ఉదయం సాధారణ ప్రసవం ద్వారా ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చారు. కొడుకు పుడతాడని ఆశించినా అమ్మాయిలు పుట్టడం ఆనందంగా ఉందని సత్యనారాయణ, రమాదేవి దంపతులు తెలిపారు.

More Telugu News