Narendra Modi: మోదీ సోదరుని కుమార్తె పర్సు లాక్కెళ్లిన దొంగలు!

  • ఢిల్లీలో ఘటన
  • పర్సులో రూ.56 వేలు నగదు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రతపై ఎన్నో విమర్శలున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ సోదరుని కుమార్తె దమయంతి బెన్ మోదీకి కూడా అనూహ్య పరిణామం ఎదురైంది. దుండగులు  పెద్ద మొత్తంలో నగదు ఉన్న పర్సును ఆమె చేతి నుంచి లాగేసుకున్నారు. దమయంతి బెన్ ఈ ఉదయం అమృత్ సర్ నుంచి ఢిల్లీ వచ్చారు. సివిల్ లైన్స్ లోని గుజరాతీ సమాజ్ భవన్ లో ఓ గదిలో బస చేశారు. ఆమె తన బస చేరుకునే క్రమంలో రోడ్డుపైకి రాగానే ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి ఆమె చేతిలోని పర్సును లాక్కున్నారు.

ఆ పర్సులో రూ.56 వేలు నగదు, రెండు ఫోన్లు, ఇతర డాక్యుమెంట్లు, విమాన టికెట్లు ఉన్నట్టు తెలుస్తోంది. క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో దమయంతి బెన్ దిగ్భ్రాంతికి గురయ్యారు. కాసేపటికి తేరుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జరిగింది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి కూతవేటు దూరంలోనే కావడం చూస్తుంటే అక్కడ భద్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

More Telugu News