snake: అమ్మ ప్రేమ... పిల్లల కోసం పాముతో పోరాడిన శునకం

  • రెండు పిల్లల్ని కాటేసి చంపిన పాము 
  • ఒకదాన్ని బతికించుకున్న తల్లి
  • నాగోల్‌ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఘటన

మనిషైనా...జంతువైనా అమ్మ ప్రేమ ఒక్కటే. తన బిడ్డలపై దాడి చేస్తున్న పాముతో చాలాసేపు పోరాడింది ఓ తల్లి కుక్క. అయితే రెండు రోజుల క్రితం జన్మనిచ్చిన మూడు పిల్లల్లో రెండు మృతి చెందగా ఒకటి మాత్రమే బతికి బట్టకట్టింది. వివరాల్లోకి వెళితే..హైదరాబాద్‌లోని నాగోల్‌ ఆర్టీఏ కార్యాలయాన్ని ఆనుకుని ఆదర్శనగర్‌ కాలనీ ఉంది. 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కార్యాలయం ఆవరణలో పెద్ద సంఖ్యలో పాములున్నాయి.

శుక్రవారం ఓ పాము ఆదర్శనగర్‌ కాలనీలోకి చొరబడింది. అక్కడి రోడ్డు నెంబరు-2లోని ఓ వీధిలో ఉన్న షెడ్డులోకి పాము చేరింది. ఆ షెడ్డులో రెండు రోజుల క్రితమే ఓ శునకం మూడు పిల్లలకు జన్మనిచ్చింది. పాము రావడం చూసిన తల్లి కుక్క అరవడం ప్రారంభించింది. పాము కూడా బుసలు కొడుతూ అక్కడే నిబడింది.

ఇలా చాలాసేపు కుక్క అరుస్తూనే ఉంది. ఈలోగా కాలనీవాసులు, ఆర్టీఏ కార్యాలయం సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కుక్క ఎంతగా అరుస్తున్నా పాము బెదరలేదు. శునకం కూడా తన బిడ్డల్ని కాపాడుకునే ప్రయత్నం ఆపలేదు. చాలా సేపటి తర్వాత పాము తోక ముడిచి వెళ్లిపోయింది. కానీ అంతకు ముందే రెండు పిల్లల్ని కాటేయడంతో అవి చనిపోయాయి.

More Telugu News