GST: జీఎస్టీ విధానాన్ని తప్పుబట్టకండి: నిర్మలాసీతారామన్‌

  • జీఎస్టీలో లోపాలున్న మాట వాస్తవం
  • సలహాలు ఇవ్వండి... సరిదిద్దుతాం
  • దూషణలతో ఏం ప్రయోజనం

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో లోపాలున్న మాట వాస్తవమేనని, అంతమాత్రాన విధానమే తప్పని విమర్శించడం, దూషించడం సరికాదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఆర్థిక నిపుణులు తగిన సలహాలు ఇస్తే లోపాలు సరిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పరిశ్రమ వర్గాలు, పలువురు ఆర్థిక రంగ నిపుణులతో పూణెలో శుక్రవారం ఆమె సమావేశం నిర్వహించారు. జీఎస్టీ వసూళ్లలో క్షీణత ఉందని, కొన్ని ప్రాంతాల్లో ప్రకృతి విపత్తుల కారణంగా వసూళ్లు తగ్గాయని వివరించారు. ఇందుకు గల కారణాలను అన్వేషించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా కొంతమంది జీఎస్టీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై స్పందించిన నిర్మల పార్లమెంటు సహా అన్ని రాష్ట్రాల శాసన సభల్లోనూ ఆమోదం పొందిన జీఎస్టీ విధానాన్ని తప్పుబట్టడం సరికాదన్నారు. ఇబ్బందులు ఉన్నంత మాత్రాన వ్యతిరేకించకుండా మెరుగైన విధాన రూపకల్పనకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కొందరు ఆర్థిక నిపుణులు ఇచ్చిన సలహాలను మంత్రి స్వీకరించారు.

More Telugu News