united nations: అమెరికా కంటే భారత్‌ ముందంజ: 'ఐరాస'కు వంద శాతం చెల్లింపులు

  • నిధుల్లేక అల్లాడుతున్న ఐక్య రాజ్య సమితి
  • 193 సభ్యదేశాల్లో పూర్తి వాటా చెల్లించినవి 35 దేశాలే
  • బకాయి పడ్డ వాటిలో వీటో అధికారం ఉన్న దేశాలు

అధికారంలో అగ్ర స్థానంలో ఉన్నా చెల్లింపుల్లో మాత్రం వెనుకబడి ఉన్నాయి ఐక్యరాజ్య సమితి (ఐరాస) వీటో అధికారం ఉన్న సభ్య దేశాలు. వంద శాతం చెల్లింపుల విషయంలో ప్రపంచ పెద్దన్న అమెరికా కంటే భారత్‌ ముందుండడం విశేషం. సభ్యదేశాలు అందించే వాటా నిధులతోనే ఐరాసా కొనసాగుతుంది. ప్రస్తుతం నిధుల్లేక ఐరాస అల్లాడిపోతోంది. ఖజానా ఖాళీ అయిందని, ఈ నెలాఖరుకు రిజర్వ్‌ నిధులు కూడా అయిపోయే ప్రమాదం ఉందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 230 మిలియన్‌ డాలర్ల లోటుతో ప్రస్తుతం సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు.

ఈ నేపథ్యంలో సభ్య దేశాలు తమ వాటా నిధులు చెల్లించాలంటూ వరుసగా చేస్తున్న విజ్ఞప్తులకు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. మొత్తం 193 సభ్యదేశాల్లో ఇప్పటి వరకు పూర్తిగా వాటా నిధులు చెల్లించిన దేశాలు 35 మాత్రమే. ఈ జాబితాను ఐరాస వెల్లడించింది.

అయితే బకాయి ఉన్న దేశాల జాబితాను వెల్లడించలేదు. కానీ బకాయిలు పూర్తిగా చెల్లించిన దేశాల్లో వీటో అధికారం వున్న దేశం ఒక్కటీ లేకపోవడం గమనార్హం. బకాయిలు ఉన్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్‌, అర్జెంటీనా, మెక్సికో, ఇరాన్‌ తదితర దేశాలు ఉన్నాయి.

More Telugu News