Vishal: విశాల్ వివాహం అనీశాతోనే జరుగుతుంది!: తండ్రి జీకే రెడ్డి స్పష్టీకరణ

  • విశాల్ నిశ్చితార్థం రద్దయినట్టు వార్తలు
  • ఖండించిన జీకే రెడ్డి
  • నడిగర్ సంఘం భవనంలో వివాహం
  • ఇంకా తేదీ నిశ్చయించలేదని వెల్లడి

తన కుమారుడు, హీరో విశాల్ వివాహం ముందుగా నిర్ణయించినట్టు అనీశా రెడ్డితోనే జరుగుతుందని ఆయన తండ్రి, నిర్మాత జీకే రెడ్డి స్పష్టం చేశారు. గడచిన మార్చి 18న వీరిద్దరి నిశ్చితార్థమూ జరుగగా, ఈ నెల 9న వివాహమని అంతా అనుకున్నారు. కానీ, 9న వివాహం జరగకపోవడం, దీనికి సంబంధించిన వార్తలేవీ బయటకు రాకపోవడంతో ఇద్దరి నిశ్చితార్థం రద్దయిందన్న పుకార్లు వచ్చాయి.

దీనిపై తాజాగా చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో జీకే రెడ్డి స్పందించారు. వారిద్దరి పెళ్లి ఎప్పుడు చేయాలన్న విషయమై ఇంతవరకూ తేదీని నిశ్చయించలేదని స్పష్టం చేశారు. నడిగర్ సంఘం నూతన భవంతిలో వారి పెళ్లి వైభవంగా జరుగుతుందని అన్నారు.

కాగా, నడిగర్ సంఘం ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును కోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడైతే, విశాల్ గెలుపు ఖాయమని జీకే రెడ్డి వ్యాఖ్యానించారు. ఆపై భవనం నిర్మాణాన్ని తన కుమారుడు త్వరితగతిన పూర్తి చేస్తాడని, దానిలోనే వివాహం చేసుకుంటాడని ఆయన తెలిపారు. శరత్ కుమార్, రాధిక దంపతులతో తమకు ఎటువంటి విభేదాలూ లేవని అన్నారు.

More Telugu News