Srikakulam District: రాత్రి తాళి కట్టాడు.. ఉదయం పరారయ్యాడు!

  • శ్రీకాకుళం జిల్లా పోలాకిలో ఘటన
  • నాలుగు నెలలుగా బాలిక వెంటపడిన యువకుడు
  • ఇరు వర్గాలను పిలిపించి న్యాయం చేస్తామన్న పోలీసులు

ఇంటర్ చదువుతున్న బాలిక వెంటపడి ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పిన యువకుడు.. ఆపై ఓ గుడిలో రాత్రి వేళ తాళి కట్టి ఉదయాన్నే పరారయ్యాడు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో జరిగిందీ ఘటన. మోసపోయినట్టు గ్రహించిన బాలిక నిన్న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. రోజూ సైకిలుపై కాలేజీకి వెళ్లి వస్తున్న బాలికను చూసిన అదే గ్రామానికి చెందిన యువకుడు వెంకటేశ్ ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడ్డాడు. పెళ్లి చేసుకుందామంటూ నాలుగు నెలలుగా ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడు.

ఈ క్రమంలో బాలిక తన తాత గారి ఇంటి వద్ద ఉన్న విషయం తెలుసుకున్న వెంకటేశ్.. బాలిక వద్దకు వెళ్లి పెళ్లి చేసుకుందామని నమ్మించి గ్రామ సమీపంలో ఉన్న అమ్మవారి ఆలయం వద్దకు తీసుకెళ్లి తాళి కట్టాడు. రాత్రికి ఇద్దరూ అక్కడే గడిపారు. అయితే, ఉదయం లేచి చూసేసరికి వెంకటేశ్ కనిపించకపోవడంతో మోసపోయినట్టు గుర్తించిన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అనంతరం వారితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేడు ఇరు వర్గాలను పిలిపించి బాలికకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

More Telugu News