godavar khani: మద్యానికి బానిసై వేధిస్తున్న భర్త.. కళ్లలో కారం కొట్టి దారుణంగా నరికి చంపిన భార్య

  • గోదావరి ఖనిలో చోటుచేసుకున్న ఘటన
  • వేధిస్తున్న భర్తపై కత్తితో దాడిచేసి హతమార్చిన భార్య
  • కారణం అదికాదంటున్న భర్త కుటుంబ సభ్యులు

మద్యానికి బానిసై నిత్యం వేధిస్తున్న భర్తను అత్యంత దారుణంగా హతమార్చిందో ఇల్లాలు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..పట్టణంలోని జవహర్‌నగర్ కాలనీకి చెందిన కొయ్యడ చంద్రయ్య-సుగుణమ్మలు భార్యాభర్తలు. చంద్రయ్య సింగరేణి కాలరీస్‌లో కార్మికుడు. పూర్తిగా మద్యానికి బానిసైన చంద్రయ్య భార్యను నిత్యం వేధించడం మొదలుపెట్టాడు. దీంతో గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో నిన్న కూడా ఇద్దరి మధ్య మరోమారు గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సుగుణమ్మ భర్త కళ్లలో కారం కొట్టి కత్తితో దాడిచేసింది. మెడ, కాళ్లు, చేతులపై విచక్షణ రహితంగా కత్తితో పొడిచింది. తీవ్ర గాయాలపాలైన చంద్రయ్య తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భర్త మృతి చెందిన విషయాన్ని నిర్ధారించుకున్న సుగుణమ్మ అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగింది చెప్పి లొంగిపోయింది. అయితే, సుగుణమ్మ అబద్ధాలు చెబుతోందని, హత్యకు మద్యం తాగడం కారణం కాదని, ఇంకేదో ఉంటుందని చంద్రయ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

More Telugu News