Warangal Rural District: భార్యను కాదని మరో మహిళతో వివాహేతర సంబంధం.. పట్టుకుని చావబాదిన అత్తమామలు

  • వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో ఘటన
  • రెండేళ్ల క్రితం భార్యను వదిలేసిన భర్త
  • నడిరోడ్డుపై చెప్పులతో కొడుతూ ఈడ్చుకెళ్లిన అత్తమామలు

భార్యను కాదని మరో మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని అత్తమామలు, బావమరిది కలిసి చితకబాదారు.  చెప్పులతో కొట్టుకుంటూ నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లారు. వారి బారి నుంచి అతడిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వరంగల్ రూరల్ జిల్లాలోని వర్ధన్నపేటలో శుక్రవారం జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం..  హన్మకొండకు చెందిన కుమారస్వామి- వర్ధన్నపేటకు చెందిన శిరీషలు భార్యాభర్తలు. నాలుగేళ్ల క్రితం వీరికి వివాహం కాగా, పెళ్లైన కొద్దిరోజులకే శిరీష వేధింపులకు గురైంది. నిత్యం తనను హింసిస్తుండడంతోపాటు తన మెడలోని మంగళసూత్రాన్ని సైతం భర్త తాకట్టు పెట్టేశాడని శిరీష ఆరోపించింది. అంతేకాకుండా తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని పేర్కొంది. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం శిరీషను కుమారస్వామి వదిలిపెట్టాడు.

జల్సాలకు అలవాటుపడి తమ కుమార్తెను వదిలిపెట్టిన కుమారస్వామిపై ఆగ్రహంతో ఉన్న శిరీష తల్లిదండ్రులు శుక్రవారం కుమారుడితో కలిసి అల్లుడిపై దాడి చేశారు. అతడిని పట్టుకుని విపరీతంగా కొట్టారు. చెప్పులతో కొడుతూ నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఇది చూసిన స్థానికులు వారి బారి నుంచి కుమారస్వామిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కుమారస్వామిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News