Lakshman: సమైక్యపాలనలోనూ ఇలాంటి అరాచకాలు లేవు: తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్

  • ప్రభుత్వం కార్మికులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందన్న లక్ష్మణ్
  • తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నామని వెల్లడి
  • ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యలు

ఆర్టీసీ సమ్మె తెలంగాణ ఉద్యమంతో ముడిపడి ఉందని తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. సమ్మె చేస్తున్న కార్మికులకు మద్దతుగా రేపు హైదరాబాద్ బస్ భవన్ వద్ద ఆందోళన చేస్తున్నామని చెప్పారు. ఇదే తరహాలో తెలంగాణ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్మికులను రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, 50 వేల మందిని ఉద్యోగం నుంచి తొలగించడం రెచ్చగొట్టే చర్య కాకపోతే మరేంటని లక్ష్మణ్ మండిపడ్డారు. సమైక్య పాలనలో కూడా ఇలాంటి అరాచకాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. స్వరాష్ట్ర పాలన అంటే ఇదేనా? అని టీఆర్ఎస్ సర్కారును నిలదీశారు.

పండుగ పూట కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేదని, ఆర్టీసీని నిర్వీర్యం చేసి, ఆస్తులను అనుచరులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఆస్తులపై కన్నేసి, ప్రైవేటీకరణకు మొగ్గు చూపుతున్నారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితులతో విసిగిపోయిన ప్రజలు ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు గతం వారం రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెకు బీజేపీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తోందని, ప్రజా ఉద్యమాలకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని లక్ష్మణ్ స్పష్టం చేశారు.

More Telugu News