Virat Kohli: అరుదైన రికార్డును అందుకున్న కోహ్లీ.. గంగూలీ రికార్డు బద్దలు

  • 50వ టెస్టుకు సారథ్యం వహిస్తున్న కోహ్లీ
  • 49 టెస్టులకు కెప్టెన్సీ వహించిన గంగూలీ రికార్డు బద్దలు
  • 29 విజయాలతో కెప్టెన్‌గా సరికొత్త రికార్డు

భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టుతో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. కెప్టెన్‌గా కోహ్లీకి ఇది 50వ టెస్టు మ్యాచ్. టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ 2000 నుంచి 2005 మధ్య 49 టెస్టులకు సారథ్యం వహించాడు. ఇప్పుడా రికార్డును కోహ్లీ బద్దలుగొట్టాడు. ఈ విషయాన్ని బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు కోసం మైదానంలో అడుగుపెట్టిన కోహ్లీకి ఇది 50వ టెస్ట్ మ్యాచ్ అని పేర్కొన్న బీసీసీఐ.. అతడికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది.

ఇక, ఈ జాబితాలో మరో మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ధోనీ ఏకంగా 60 టెస్టులకు సారథ్యం వహించాడు. మరో ఏడాదిలోపే కోహ్లీ ఈ రికార్డును కూడా సవరించే అవకాశం ఉంది. మరోవైపు, అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గానూ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు అతడి సారథ్యంలో 49 టెస్టులు జరగ్గా 29 టెస్టుల్లో జట్టుకు విజయాలు అందించాడు. ధోనీ 60 మ్యాచుల్లో 27 టెస్టుల్లో మాత్రమే భారత్‌ను గెలిపించాడు. ఇక, 21 విజయాలతో గంగూలీ మూడో స్థానంలో ఉన్నాడు.

More Telugu News