Chandrababu: చంద్రబాబు విచిత్రమైన మానసిక స్థితిలో ఉన్నారు: అంబటి రాంబాబు

  • జగన్ పై బాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు
  • ‘జగన్ పులివెందుల పంచాయితీ..’ అని అంటారా?
  • పంచాయతీలు చేసే లక్షణం చంద్రబాబుకే ఉంది

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ పై చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విచిత్రమైన మానసిక స్థితిలో ఉన్నారని విమర్శించారు. టీడీపీ నాయకులు పార్టీని వీడుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని, ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

చంద్రబాబు ఎక్కడికి వెళితే అక్కడ ‘జగన్ పులివెందుల పంచాయితీ..’ అంటూ చేస్తున్న వ్యాఖ్యలు తగదని అన్నారు. పంచాయితీలు చేసే లక్షణం చంద్రబాబుకే ఉందని, పులివెందుల పంచాయితీ కాదు పౌరుషానికి నిదర్శనమైన ప్రాంతమని అన్నారు. ఏపీలో ఈరోజు ప్రారంభించిన ‘కంటి వెలుగు’ పథకంపైనా చంద్రబాబు విమర్శలు చేస్తుండటంపై ఆయన మండిపడ్డారు. ఈ పథకాన్ని చంద్రబాబు తన హయాంలోనే ప్రారంభించామని, గ్రామ సచివాలయాలను కూడా తన హయాంలోనే ఆయనే ప్రారంభించారని చెప్పుకుంటున్నారని, అలా అయితే కనుక ఈ పథకాలను కాగితాలపై మాత్రమే పెట్టి డబ్బులు గుంజి ఉంటారని సెటైర్ వేశారు. 

More Telugu News