Telangana: రేపు మరోమారు భేటీ కావాలని నిర్ణయించాం: టీఎస్సార్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి

  • ముగిసిన టీఎస్సార్టీసీ జేఏసీ, అఖిలపక్ష నేతల భేటీ
  • ఎల్లుండి అన్ని డిపోల దగ్గర మౌన ప్రదర్శన నిర్వహిస్తాం
  • రేపు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం

టీఎస్సార్టీసీ జేఏసీ, అఖిలపక్ష నేతల సమావేశం ముగిసింది. అనంతరం, మీడియాతో జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, రేపు మరోమారు భేటీ కావాలని నిర్ణయించామని, అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ప్రజా రవాణాను కాపాడుకునేందుకే సమ్మెకు దిగామని, ఎల్లుండి అన్ని డిపోల దగ్గర మౌన ప్రదర్శన నిర్వహిస్తామని, అన్ని ఉద్యోగ సంఘాలు తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు.

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ, సమ్మెకు మద్దతుగా ఉండాలని కోరుతూ ప్రజాప్రతినిధులకు రేపు లేఖలు అందజేస్తామని చెప్పారు. పెద్ద ఎత్తున అన్ని సంఘాలు, పార్టీలు ఈ సమ్మెలో పాల్గొనాలని కోరారు. రేపు, ఎల్లుండి ఆర్టీసీ డిపోల వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో ప్రతి వ్యక్తి పాల్గొని తమ నిరసన తెలిపాలని కోరారు.
 
సమ్మెకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ జేఏసీ చేపట్టే నిరసన కార్యక్రమాలకు మద్దతుగా తమ పార్టీ శ్రేణులు పాల్గొంటాయని తెలంగాణ సీపీఐ  కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మరోమారు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా భాగస్వామ్యులు కావాలని కోరారు. కాగా, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో రాస్తారోకో నిర్వహించనున్నారు.

More Telugu News