Telangana: టీఎస్ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్... భార్య ఉద్యోగం పోతుందనే మనస్తాపంతో భర్త మృతి!

  • తెలంగాణలో ఆరవ రోజుకు చేరిన సమ్మె
  • ఉద్యోగం పోతే బతకలేమన్న ఆలోచనలో కిశోర్
  • నిద్రలోనే గుండెపోటుతో మృతి

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె ఆరవ రోజుకు చేరగా, తన భార్య ఉద్యోగం పోతుందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన సంగారెడ్డి పరిధిలోని బాబానగర్ లో జరిగింది. కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం, కర్నె కిశోర్ (39) ప్రైవేట్ కారు డ్రైవర్ గా పనిచేస్తుండగా, అతని భార్య నాగరాణి ఆర్టీసీలో పని చేస్తోంది.

సమ్మె నేపథ్యంలో ఉద్యోగులను తొలగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో, ఈ విషయమై వారిద్దరి మధ్యా చర్చ జరిగింది. ఉద్యోగం పోతే బతకడం చాలా కష్టతరమవుతుందని కిశోర్ భావించాడు. దీంతో గత రెండు రోజులుగా భోజనం కూడా సరిగ్గా చేయకుండా అస్వస్థతకు గురయ్యాడు. నిన్న రాత్రి నిద్రలోనే గుండెపోటు వచ్చి మరణించాడు. కిశోర్, నాగరాణి దంపతులకు రెండేళ్ల పాప ఉంది. కిశోర్ మృతితో ఆ ఇంట్లో విషాదం అలముకుంది. తన భర్త మృతికి కేసీఆర్ విధానాలే కారణమని నాగరాణి ఆరోపించారు.

More Telugu News