Reliance: జియో కీలక నిర్ణయం.. ఇకపై ఇతర నెట్ వర్క్ కి కాల్ చేస్తే ఛార్జీలు!

  • ఇతర నెట్ వర్క్ కు ఫోన్ చేస్తే ప్రతి నిమిషానికి 6 పైసలు
  • ట్రాయ్ నిబంధనల మేరకు ఐయూసీ వసూలు
  • రేపటి నుంచి అమల్లోకి రానున్న నిబంధన

టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి జియో నెట్ వర్క్ నుంచి ఇతర నెట్ వర్క్ నంబర్లకు ఫోన్ చేస్తే ప్రతి నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. రేపటి నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్టు జియో సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, వినియోగదారులు చెల్లించిన మొత్తానికి  బదులుగా తగిన డేటాను తిరిగి అందిస్తామని ఈ మేరకు జియో ఓ ప్రకటన చేసింది. ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ఛార్జీ (ఐయూసీ)ల విషయంలో టెలికాం రెగ్యులేటరి అథారిటీ (ట్రాయ్) నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.

జియో సొంత నెట్ వర్క్ కాల్స్ కు  మాత్రం ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని తెలిపింది. అలాగే, ఇన్ కమింగ్ కాల్స్, ల్యాండ్ లైన్ కాల్స్, వాట్సాప్ కాల్స్ కు ఈ ఛార్జీలు వర్తించవని వివరించింది.

 ఈ సందర్భంగా ఐయూసీ టాప్ అప్ వోచర్లను జియో ప్రవేశపెట్టింది. దీని వల్ల వినియోగదారులపై అదనపు భారం పడదని తెలిపింది. ట్రాయ్ జీరో టర్మినేషన్ చార్జిని తొలగించే వరకూ ఈ టాప్ అప్ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నిబంధన వచ్చే ఏడాది జనవరి 1 వరకూ అమల్లో ఉండనుంది.

More Telugu News