Polavaram Project: పోలవరంపై తక్షణమే విచారణ జరిపించండి: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

  • పోలవరంలో అవినీతి చోటుచేసుకుందంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
  • అంచనా వ్యయాన్ని పెంచేశారంటూ పిటిషన్ లో ఆరోపణ
  • విచారణ జరపాలని కేంద్ర జల శక్తి శాఖకు కోర్టు ఆదేశం

పోలవరం ప్రాజెక్టులో అంతులేని అవినీతి చోటు చేసుకుందంటూ దాఖలైన పిటిషన్ ను ఈరోజు ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఈ పిటిషన్ ను సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు వేశారు. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ. 16 వేల కోట్ల నుంచి రూ. 58 వేల కోట్లకు పెంచారని తన పిటిషన్ లో పేర్కొన్నారు. నామినేషన్ విధానంలో వేల కోట్ల రూపాయల పనుల టెండర్లను అప్పగిస్తున్నారని ఆరోపించారు.

ఈ పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. పిటిషన్ ను ఫిర్యాదుగా భావించి తక్షణమే విచారణ జరపాలని కేంద్ర జలశక్తి శాఖకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, హైకోర్టు ఆదేశాలపై పెంటపాటి పుల్లారావు హర్షం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలతో పోలవరం పనుల్లో చోటు చేసుకున్న అవినీతి బయటపడుతుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన అధికారులే... కొత్త ప్రభుత్వంలో కూడా బాధ్యతలను నిర్వహిస్తున్నారని చెప్పారు. పోలవరం పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం... ఇదే విషయంపై ఢిల్లీలో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

More Telugu News