Jagan: రచ్చకెక్కిన నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు.. జగన్ సీరియస్

  • కోటంరెడ్డి, కాకాని మధ్య తీవ్ర స్థాయికి చేరిన వర్గ విభేదాలు
  • ఎంపీడీఓ సరళ వ్యవహారం తర్వాత మరింత ముదిరిన విభేదాలు
  • అమరావతికి రావాలంటూ జగన్ ఆదేశం

నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డికి మధ్య తలెత్తిన విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. రెండు నెలల క్రితమే వీరి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. తాజాగా ఎంపీడీవో సరళపై దౌర్జన్యం చేసిన కేసులో కోటంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ పై వచ్చిన తర్వాత కోటంరెడ్డి మాట్లాడుతూ, ఎంపీడీవో సరళను ఇక్కడకు తీసుకొచ్చింది కాకానే అని ఆయన నేరుగా ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన స్వేచ్ఛను కాకాని దుర్వినియోగం చేశారని అన్నారు.

ఈ నేపథ్యంలో, ఈ ఇద్దరు ఎమ్మెల్యేల తీరుపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. ఇద్దరినీ రాజధానికి రావాలని ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఇరువురు నేతలతో జగన్ నేరుగా మాట్లాడనున్నారు. మరోవైపు, ఇరువురు ఎమ్మెల్యేల మధ్య విభేదాలకు రియలెస్టేట్ వ్యవహారాలే కారణమని భావిస్తున్నారు.

More Telugu News