KCR: అప్పుడు యోధుల్లా కనిపించినవారు ఇప్పుడు బానిసలు, కుక్కల్లా కనిపిస్తున్నారా?: రేవంత్ రెడ్డి

  • ఆర్టీసీ కార్మికులు 35 రోజుల క్రితమే సమ్మె నోటీసు ఇచ్చారు
  • వారితో మాట్లాడే తీరిక కూడా కేసీఆర్ కు లేకపోయింది
  • ఒక్క ఆర్టీసీ కార్మికుడి ఉద్యోగాన్ని కూడా కేసీఆర్ తొలగించలేరు

ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే వారిలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారనేది జగమెరిగిన సత్యం. తాజాగా ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో, ముఖ్యమంత్రిపై రేవంత్ మరింత ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. 35 రోజుల క్రితమే ఆర్టీసీ కార్మికులు చట్ట బద్ధంగా సమ్మె నోటీసును ఇచ్చారని... వారిని పిలిచి మాట్లాడే తీరిక కూడా కేసీఆర్ కు లేకపోయిందని మండిపడ్డారు. ఆరేళ్లుగా సచివాలయానికి కూడా రాని కేసీఆర్ పై పీడీ యాక్టు పెట్టి అండమాన్ జైలుకు పంపాలా? అని ప్రశ్నించారు.

ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసేందుకు కేసీఆర్ కు సమయం ఉంటుందని... కార్మికులను కలిసేందుకు మాత్రం ఉండదని రేవంత్ దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమం సమయంలో యోధుల్లా కనిపించినవారు ఇప్పుడు బానిసలు, కుక్కల్లా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఒక్క ఆర్టీసీ కార్మికుడిని కూడా కేసీఆర్ ఉద్యోగం నుంచి తొలగించలేరని... న్యాయాన్ని పరిరక్షించేందుకు న్యాయస్థానాలు ఉన్నాయని అన్నారు.

More Telugu News