Uttar Pradesh: తల్లి ఒడిలో బిడ్డ మాయం.. నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లిన మరో మహిళ

  • ఉత్తరప్రదేశ్‌ లోని మొరాదాబాద్‌ నగరంలో ఘటన
  • సీసీ టీవీ పుటేజీలో చిక్కిన నిందితురాలు
  • ఆమె కోసం గాలిస్తున్న పోలీసులు

తల్లి చెంతన ఆదమరిచి నిద్రపోతున్న ఎనిమిది నెలల చిన్నారిని ఓ గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లింది. బస్టాండ్‌లో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...ఉత్తరప్రదేశ్‌ లోని మొరాదాబాద్‌ నగరం షహీద్‌ ప్రాంతంలోని బస్టాండ్‌కు ఓ తల్లి తన బిడ్డతోపాటు వచ్చింది.

 అప్పటికే రాత్రికావడం, తన ప్రాంతానికి వెళ్లేందుకు బస్సు లేకపోవడంతో బస్టాండ్‌లోనే విశ్రాంతి తీసుకోవాలనుకుంది. బిడ్డను పక్కనే పడుకోబెట్టుకుని తను కూడా నిద్రపోయింది. దీన్ని ఎక్కడి నుంచి గమనించిందో ఏమో ఓ దుండగురాలు తల్లీబిడ్డలు ఆదమరిచి నిద్రపోతుండగా చడీచప్పుడు కాకుండా బిడ్డను తీసుకుని వెళ్లిపోయింది.

కాసేపటికి మెలకువ వచ్చిన తల్లి చెంతన బిడ్డ లేకపోవడంతో ఆందోళనతో చుట్టూ వెతికింది. కనిపించక పోవడంతో రాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ పుటేజీ పరిశీలించగా ఓ ఆగంతుకురాలు బిడ్డను ఎత్తుకు వెళ్తుండడం కనిపించింది. దీంతో ఆమెను పట్టుకునేందుకు గాలింపు మొదలుపెట్టారు.

More Telugu News