Team India: వరల్డ్ కప్ నుంచి భారత్ నిష్క్రమించాక షమీ నాకు ఫోన్ చేశాడు: అక్తర్

  • షమీ తన బాధను పంచుకున్నాడని చెప్పిన పాక్ బౌలర్
  • ఫిట్ నెస్ కాపాడుకోమని సలహా ఇచ్చానని వెల్లడి
  • భారత క్రికెటర్లతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న అక్తర్

భారత క్రికెటర్లతో సన్నిహిత సంబంధాలున్న పాకిస్థాన్ క్రికెట్ ఆటగాళ్లలో షోయబ్ అక్తర్ ఒకరు. తన భీకర ఫాస్ట్ బౌలింగ్ తో అంతర్జాతీయ క్రికెట్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా, అక్తర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో  సెమీఫైనల్ లో ఓడిపోయాక టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తనకు ఫోన్ చేశాడని అక్తర్ వెల్లడించాడు. జట్టు కోసం సరైన రీతిలో బౌలింగ్ చేయలేకపోతున్నానని షమీ వాపోయాడని, ఎంతో బాధపడ్డాడని వివరించాడు.

అయితే, తాను ఫిట్ నెస్ కాపాడుకోమని సలహా ఇచ్చానని, ఫిట్ గా ఉంటేనే పూర్తిస్థాయిలో బౌలింగ్ ప్రదర్శన చేయగలవని చెప్పానని అక్తర్ తెలిపాడు. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్ లో తప్పక రాణిస్తావని ఆత్మవిశ్వాసం నింపానని చెప్పాడు. ఉపఖండం బౌలర్లలో రివర్స్ స్వింగ్ చేయగల సామర్థ్యం ఉన్న అతికొద్దిమందిలో షమీ కూడా ఉన్నాడని, రివర్స్ స్వింగ్ రారాజు అవుతాడని అభిప్రాయపడ్డాడు.

More Telugu News