Telangana: ఆర్టీసీ సమ్మెకు మద్దతివ్వడానికి కాంగ్రెస్, బీజేపీలకు సిగ్గుండాలి: ఎర్రబెల్లి ధ్వజం

  • స్వార్థం కోసం ఆర్టీసీ సమ్మెను ఉపయోగించుకుంటున్నారని వ్యాఖ్యలు
  • దేశంలోనే అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నామని వెల్లడి
  • ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ఆర్టీసీ కార్మికులకు హితవు

తెలంగాణలో ఓవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పండుగ రోజుల్లో ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని, ఆర్టీసీ కార్మికులు తమ తప్పు తెలుసుకుని ప్రభుత్వానికి సరెండర్ కావాలని స్పష్టం చేశారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలోనే ఆర్టీసీ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నారని ఎర్రబెల్లి వివరించారు.

అసలు, ఆర్టీసీలో సమ్మె జరగడానికి కారణం కాంగ్రెస్, బీజేపీ వైఖరేనని ఆరోపించారు. సమ్మెకు మద్దతివ్వడానికి ఆ రెండు పార్టీలకు సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆర్టీసీ సమ్మెను ఉపయోగించుకుంటున్నాయని మండిపడ్డారు. అయినా, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా? అంటూ ప్రశ్నించారు.

More Telugu News