Jupudi: వైసీపీలో చేరిన కారణాన్ని వివరించిన జూపూడి ప్రభాకర్ రావు!

  • జగన్ సమక్షంలో వైసీపీలోకి
  • అభివృద్ధిలో భాగం కావాలని భావించా
  • జగన్ ఆదర్శ ముఖ్యమంత్రన్న జూపూడి

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల తరువాత, ప్రత్యక్ష రాజకీయాలకు కాస్తంత దూరంగా ఉంటూ, తెలుగుదేశం పార్టీతో సంబంధాలను తెంపుకున్న జూపూడి ప్రభాకర్ రావు, కొద్దిసేపటి క్రితం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మంచి పరిపాలన కావాలని, రాజన్న రాజ్యం మరోసారి వస్తుందని ప్రజలు జగన్ ను ఆశీర్వదించారని వ్యాఖ్యానించారు.

ఇక ఎన్నడూ లేని విధంగా కేబినెట్ లో ఐదుగురు దళితులకు స్థానం కల్పించిన ఘనత జగన్ దేనని అన్నారు. ఈ అంశాన్ని దేశమంతా ఆదర్శంగా తీసుకుందని, మద్య నిషేధం, వాహనమిత్ర, నవరత్నాల అమలు తదితర అంశాల్లో జగన్ వేస్తున్న అడుగులు తనకు స్ఫూర్తి నిచ్చాయని జూపూడి తెలిపారు. అందువల్లే జగన్ వెంట నడిచి, రాష్ట్రాభివృద్ధిలో భాగం కావాలని భావించానని చెప్పారు. అందువల్లే పార్టీలో చేరానని అన్నారు. జగన్ పరిపాలన ప్రతి రాష్ట్ర సీఎంకూ ఆదర్శంగా నిలిచిందని పొగడ్తలు కురిపించారు.  తనవైపున కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని, వాటిని సరిదిద్దుకుంటానని జూపూడి ప్రభాకర్ రావు వ్యాఖ్యానించారు.

More Telugu News