Pune: ఎయిరిండియా విమానంలో మహిళా ఎంపీ షాక్... ఆమ్లెట్ లో గుడ్డు పెంకులు!

  • పూణే నుంచి న్యూఢిల్లీకి వెళ్లిన వందనా చవాన్
  • విమానంలో ఎదురైన ఘటనపై ఫిర్యాదు
  • సీరియస్ గా తీసుకున్న ఎయిరిండియా

ఓ మహిళా ఎంపీ ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న వేళ, తినేందుకు ఆమ్లెట్ కావాలని కోరగా, ఆమ్లెట్ తో పాటు కోడి గుడ్డు పెంకులు కూడా వచ్చాయి. దీంతో పాటు వడ్డించిన కూరలో ఉడకని బంగాళాదుంపలు, బీన్స్ కూడా రావడంతో ఎయిరిండియా విచారణకు ఆదేశించింది. ఎన్సీపీ రాజ్యసభ సభ్యురాలు వందనా చవాన్ పూణే నుంచి న్యూఢిల్లీకి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

 మొత్తం విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో వందనా చవాన్ వెల్లడించారు. తాను విమానం ఎక్కి ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చానని, తింటుండగా దీనిలో గుడ్డు పెంకులు కూడా వచ్చాయని ఫిర్యాదు చేస్తూ, పౌరవిమానయాన శాఖ మంత్రి హరదీప్ పూరితో పాటు నరేంద్రమోదీ, ఎయిరిండియా సీఎండీ, పౌర విమానయాన శాఖ డైరెక్టరు జనరల్ లను ట్యాగ్ చేశారు. వడ్డించిన కూర కూడా తినేలా లేదని ఆరోపించారు.

ఈ విషయంపై ఎయిరిండియా స్పందించింది. కేటరింగ్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూస్తామని సంస్థ ప్రతినిధి ధనుంజయ్ కుమార్ చెప్పారు.

More Telugu News