Andhra Pradesh: ఏపీలో ఈ నెల 15 నుంచి ‘రైతు భరోసా’ అమలు

  • కౌలు రైతులకూ ‘రైతు భరోసా’ వర్తిస్తుంది
  • అక్టోబర్ 10న ‘రైతు భరోసా’ అర్హులు, అనర్హుల పట్టిక
  • దీనిపై అభ్యంతరాలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలి: వ్యవసాయ శాఖ 

ఏపీలో ఈ నెల 15 నుంచి ‘రైతు భరోసా’ పథకం అమలు చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా వైఎస్సార్ ‘రైతు భరోసా’ పెట్టుబడి సహాయ కార్యక్రమం వర్తిస్తుందని తెలిపింది. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా రైతు సంక్షేమమే ముఖ్యమంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పడ్డ కొద్దిరోజులకే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది.

అక్టోబర్ 10న అన్ని గ్రామ సచివాలయ కేంద్రాల వద్ద ‘రైతు భరోసా’ అర్హులు, అనర్హుల పట్టికను ప్రదర్శించనున్నట్టు వివరించింది. దీనిపై అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించింది. గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు పెద్ద పీట వేయడం జరిగిందని, వీటిని సరిచేయడానికి రైతులు, అర్హులు సహకరించాలని కోరింది.

భూమి కలిగి ఉన్న లక్షా 7 వేల మంది రైతులు తమ వారసులను లబ్ధిదారులను గుర్తించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఈ మేరకు అధికారులను వ్యవసాయ శాఖా మంత్రి కార్యాలయం ఆదేశించింది. ‘రైతు భరోసా’ ద్వారా రైతులకు నేరుగా సాయం అందేవిధంగా చర్యలు చేపట్టామని, అర్హులైన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా, అనర్హులను పూర్తి సమాచారం ద్వారా తొలగించాలని అధికారులను ఆదేశించినట్లు స్పష్టం చేసింది.

More Telugu News