Telangana: ‘బంగారు తెలంగాణ’ కాదు ‘కల్వకుంట్ల తెలంగాణ’గా మారింది: బీజేపీ నేత లక్ష్మణ్

  • ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానికి లేదా?
  • ఆర్టీసీ జేఏసీతో మాట్లాడే సమయం సీఎం కేసీఆర్ కు లేదా?
  • ఆర్టీసీ ఆస్తిని కేసీఆర్ తన అనుచరులకు దోచిపెట్టే కుట్ర చేస్తున్నారు 

ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఆర్టీసీ జేఏసీతో మాట్లాడటానికి గంట సమయం కూడా సీఎం కేసీఆర్ కు దొరకలేదా? అని టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్టీసీకి ఉన్న లక్ష కోట్ల రూపాయల ఆస్తిని అప్పనంగా తన అనుచరులకు దోచిపెట్టేందుకు కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలను ద్రోహులకు తాకట్టుపెట్టారని, ప్రస్తుత రవాణా శాఖ మంత్రి ఏనాడైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని, ఆయన తాబేదార్లతో తెలంగాణను విచ్ఛినం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ‘బంగారు తెలంగాణ కాదు కల్వకుంట్ల తెలంగాణగా మారింది’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

More Telugu News