Maharashtra: యాచకుని వద్ద రూ.10 లక్షలకు పైగా నగదు.. ఆశ్చర్యపోయిన పోలీసులు

  • చేతి సంచిలో లక్షా 77 వేల చిల్లర
  • బ్యాంకుల్లో రూ.8.77 లక్షల డిపాజిట్లు
  • రైలు ప్రమాదంలో మృతి చెందడంతో బయటపడిన వివరాలు

యాచన చేస్తూ బతుకుతున్న ఓ వృద్ధుని వద్ద దాదాపు రూ.10 లక్షలకు పైగా డబ్బు ఉండడం పోలీసులను ఆశ్చర్యపరిచింది. అతని చేతి సంచిలో లక్షా 77 వేల రూపాయల నగదు ఉండగా, బ్యాంకుల్లో 8.77 లక్షల డిపాజిట్లు మూలుగుతుండడం విశేషం. సదరు యాచకుడు రైలు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ విషయం బయటపడింది. వివరాల్లోకి వెళితే...ముంబై వీధుల్లో భిక్షాటన చేసుకునే బిర్భిచంద్‌ అజాద్‌ (62) అనే వృద్ధుడు శుక్రవారం రాత్రి పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టి చనిపోయాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలిని సందర్శించి అతని వద్ద ఉన్న చిల్లర, బ్యాంక్‌ డిపాజిట్‌ రిసీట్‌లు చూసి ఆశ్చర్యపోయారు.

సంచిలో ఉన్న చిల్లరను దాదాపు 8 గంటలపాటు లెక్కించగా లక్షా 77 వేల రూపాయలుగా తేలింది. అతను వేర్వేరు బ్యాంకుల్లో చేసిన డిపాజిట్‌ మొత్తం 8 లక్షల 77 వేల రూపాయలుగా గుర్తించారు. ఈ యాచకుని వద్ద పాన్‌ కార్డు, ఆధార్‌కార్డు, సీనియర్‌ సిటిజన్‌ కార్డు కూడా ఉండడం మరో విశేషం. మృతుని స్వస్థలం రాజస్థాన్‌ రాష్ట్రం కాగా, ఏళ్ల క్రితం ముంబై వచ్చినట్లు గుర్తించారు. అజాద్‌ కుటుంబ సభ్యుల కోసం సంప్రదిస్తున్నట్లు తెలిపారు.

More Telugu News