TSRTC: కీలక నిర్ణయం తీసుకున్న టీఎస్ ఆర్టీసీ జేఏసీ... నిరాహార దీక్ష వాయిదా!

  • దీక్షకు లభించని పోలీసుల అనుమతి
  • దీక్షను వాయిదా వేసుకున్న జేఏసీ
  • భవిష్యత్ కార్యాచరణపై కొనసాగుతున్న చర్చలు

తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడవ రోజుకు చేరుకోగా, జేఏసీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు తలపెట్టిన నిరాహార దీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఈ ఉదయం సమావేశమైన ఆర్టీసీ జేఏసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ జేఏసీ అత్యవసర సమావేశం కొనసాగుతుండగా, భవిష్యత్తు కార్యాచరణ, ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయడంపై సమావేశంలో చర్చిస్తున్నారు.

మరోవైపు సమ్మె మూడవ రోజుకు చేరడంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. అందుబాటులో ఉన్న అన్ని ప్రైవేటు బస్సులనూ ప్రజా రవాణాకు వాడుతోంది. అదనంగా అర్హతగల డ్రైవర్లను నియమించి, పోలీసుల రక్షణలో బస్సులను నడుపుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చూస్తున్నామని, బస్సులను అడ్డుకునే కార్మికులపై క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.

కాగా, నిన్న ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన అనంతరం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డిపో అధికారులు తాత్కాలిక నియామకాలు ప్రారంభించడంతో, వాటిని అడ్డుకునేందుకు కార్మికులు ప్రయత్నిస్తుండటంతో, కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

More Telugu News