Medak District: అత్తారింటికి వెళ్లి భార్యతో గొడవ.. ఆపై ఇంటికొచ్చి ఆత్మహత్య

  • మెదక్ జిల్లా దౌల్తాబాద్‌లో ఘటన
  • నాలుగు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిన భార్య
  • పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త

మనస్పర్థల కారణంగా పుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి రమ్మని బతిమాలినా రాకపోవడంతో మనస్తాపం చెందిన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గాజులపల్లిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పి.కనకారెడ్డి (36), విజయ భార్యాభర్తలు. లారీ డ్రైవర్ అయిన కనకారెడ్డి కుటుంబంతో కలిసి తూప్రాన్‌లో ఉంటున్నాడు. గత ఏడాది కాలంగా వీరిమధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. నాలుగు నెలల క్రితం భార్యపై చేయి చేసుకోవడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయి భర్తపై కేసు పెట్టింది. ఈ కేసు విచారణలో ఉంది.

శుక్రవారం రాత్రి ఫుల్లుగా మందుకొట్టిన  ‌కనకారెడ్డి అత్తగారి ఊరు బందారం వెళ్లి ఇంటికి రావాలంటూ భార్యతో గొడవపడ్డాడు. అనంతరం ఇంటికి చేరుకుని శనివారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. గమనించిన కనకారెడ్డి తల్లి పెంటమ్మ వెంటనే అంబులెన్స్‌లో తొలుత గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యుల సూచన మేరకు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స ప్రారంభించేలోపే కనకారెడ్డి ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News